Ram Navami 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీరాముడు దశరథుని మొదటి కుమారుడు. తను అయోధ్యలో జన్మించాడు. అందుకే తను పుట్టిన పవిత్ర జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి, శ్రీరామ నవమి వేడుకలను, శ్రీ సీతారాములోరి కళ్యాణ ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.
శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని.. అందుకే ఈరోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. ఈ సమయంలో శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాలన్నీ ‘‘శ్రీరామ’’ నామ స్మరణతో మారుమోగిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు రాములోకి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. రామాలయాల్లో, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున రామ రక్ష స్తోత్రాన్ని పఠిస్తూ కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని, అంతేకాదు ఇంట్లో సంపద పెరుగుతుందని, సీతారాముల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు.
ఈ సందర్భంగా శ్రీరామ నవమి రోజున పాటించాల్సిన పరిహారాలేంటి అనే ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఆదాయం పెంచుకునేందుకు..
ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, వారంతా శ్రీరామ నవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలని పండితులు చెబుతున్నారు. అలాగే ఒక ఎర్రని గుడ్డను తీసుకుని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకు ఆకులు, 11 లవంగాలు, పంచదారతో చేసిన 11 బాదుషాలు లక్ష్మీ దేవికి, రాముడికి సమర్పించాలి.
ఇంట్లో సుఖ శాంతుల కోసం..
శ్రీరామ నవమి వేళ హనుమాన్ ఆలయంలో సింధూరం సమర్పించాలి. సీతారాములను భక్తి శ్రద్ధలతో పూజించి, మీ మనసులో కోరికలను కోరుకోవాలి. శ్రీరామ నవమి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలు రాముడిని స్మరించుకోవడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి.
రామ మంత్రాలను..
శ్రీరామ నవమి వేళ రామ భక్తులందరూ తప్పనిసరిగా రామయ్యను స్మరించుకోవాలి. ఈరోజున సుందరకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగాజలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకుని ‘ఓం శ్రీ హ్వీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
మీ శక్తి, సామర్థ్యాల మేరకు..
శ్రీరామ నవమి వంటి పర్వదినాన రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.
పురాణాల ప్రకారం, రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. అదే విధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీని వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే..
శ్రీరామ నవమి వేళ సాయంత్రం పూట హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని.. హనుమాన్ చాలీసా పఠిస్తే, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని పండితులు చెబుతున్నారు.
అదే విధంగా నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని.. జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.