Hanuman Jayanti 2024 ఈసారి హనుమాన్ జయంతి ఎప్పుడొచ్చింది.. పూజా విధానం, శుభ ముహుర్తం, పఠించాల్సిన మంత్రాలివే..!
శుభ ముహుర్తం ఎప్పుడంటే..
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఛైత్ర మాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 24 ఏప్రిల్ 2024 ఉదయం 5:18 గంటలకు ముగుస్తాయి. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 23వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 3:25 గంటల నుంచి ఉదయం 5:18 గంటల మధ్య హనుమాన్ పూజ చేయొచ్చు.
పూజా విధానం..
* హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి.
* మీకు నివసించే ప్రాంతంలో దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించాలి.* ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి.* ఎర్ర చందనం, అక్షింతలు, పూలు, ధూప దీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి.* హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి.* పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి, ప్రసాదాన్ని అందరికీ పంచాలి.* హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ‘‘ఓం హం హనుమాన్ నమః’’ ‘‘ఓం నమో భగవతే హనుమాన్ నమః’’ అనే మంత్రాలను జపించాలి.* హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి.హనుమాన్ జయంతి ప్రాముఖ్యత..
ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు ఈరోజంతా చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్రా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీన రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు.
హనుమంతుని జననం..
పురాణాల ప్రకారం, అంజనా దేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. అయితే తనకు శాపం కారణంగా భూ లోకంలో జన్మించింది. తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం, కేసరి హనుమంతుని తండ్రి. సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు. అంజనా దేవి తన శాపం విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు.
శని దోషం పోవాలంటే..
హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ గుడికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు మీ శక్తి, సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలా మంది నమ్ముతారు.
READ ON APP