రిషభ్ పంత్ పవర్ఫుల్ 'హిట్'.. ఉత్కంఠ పోరులో చివరి బంతికి గుజరాత్పై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఒక మ్యాచ్లో గెలుస్తూ.. మరో మ్యాచ్లో ఓడుతూ ముందుకెళ్తున్న క్యాపిటల్స్.. బుధవారం గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్..
నిర్ణీత 20 ఓవర్లలో 224/4 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ను 220కి పరిమితం చేసింది. దీంతో ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచుల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కెప్టెన్గానూ ఆకట్టుకున్నాడు.ఢిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ (6) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (25 బంతుల్లో 39 రన్స్), సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65 రన్స్) స్కోరు చేయడంతో లక్ష్యం దిశగా దూసుకెళ్లింది.
9.3 ఓవర్లలో 95/1తో నిలిచింది. ఈ దశలో పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చారు. అజ్మతుల్లా ఓమర్జాయ్ (1), షారుఖ్ ఖాన్ (8), రాహుల్ తెవాటియా (4) త్వరగానే పెవిలియన్ చేరారు. కానీ డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టును మళ్లీ పోటీలోకి తెచ్చాడు. కానీ 18వ ఓవర్లో మిల్లర్ ఔట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ చేజిక్కినట్లే కనిపించింది. అప్పటికి గుజరాత్ విజయానికి ఇంకా 15 బంతుల్లో 44 కావాలి. ఈ దశలో 19వ ఓవర్లో రషీద్ ఖాన్, సాయి కిషోర్ కలిపి 18 పరుగులు రాబట్టారు.
దీంతో చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతులను ఫోర్ కొట్టిన రషీద్ ఖాన్.. మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. కానీ ఆ తర్వాత రెండు బంతులు డాట్ కాగా.. ఐదో బంతిని సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్.. ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లాడు. కానీ చివరి బంతిని డాట్ బాల్ వేసిన ముకేశ్ కుమార్.. ఢిల్లీ క్యాపిటల్స్కు విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ చివరకు 220/8తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్లో 4 పరుగులతో గెలిచిన ఢిల్లీ.. ఈ సీజన్లో నాలుగో విజయాన్ని అందుకుంది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 224/4 పరుగులు చేసింది.
ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్.. 43 బంతుల్లోనే 88 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో వారియర్ 3, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీలో 4 విజయాన్ని నమోదు చేసింది. 9 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకింది. అన్నే విజయాలు సాధించిన గుజరాత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
Next Story
READ ON APP