Hero Image

నిండా ముంచినా.. చైనా పంచనే చేరుతోన్న శ్రీలంక.. లంక ప్రధాని కీలక ప్రకటన

చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేక శ్రీలంక హంబన్‌టోటాను 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ ఒప్పందం వల్ల శ్రీలంకకు భారీ నష్టమే జరిగింది. మహీంద రాజపక్స కాలంలో అక్కడ ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ డ్రాగన్‌వే. 2005-2015 మధ్య చైనా 14 బిలియన్ డాలర్ల రుణం అందించింది. అది తడిపిమోపిడై ఆ దేశం దివాళా తీసే స్థితికి చేరింది.
రెండేళ్ల కిందట శ్రీలంకలో అకస్మాత్తుగా తీవ్రమైన ఆర్థిక గందరగోళం ఏర్పడినప్పుడు ఆర్థిక సహాయంతో భారత్ ఆదుకుంది. 2021-22 మధ్య భారత్ చేసినంత సహాయం ఏ దేశం కూడా శ్రీలంకకు చేయలేదు.కానీ, చేసిన మేలు మరిచిపోయిన శ్రీలంక.. మళ్లీ చైనాతోనే అంటకాగుతోంది. తమ దేశంలో వ్యూహాత్మక నౌకాశ్రయం, కొలంబో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సహకరిస్తామని చైనా హామీ ఇచ్చినట్టు శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్దన బుధవారం ప్రకటించారు. చైనాలో పర్యటిస్తున్న ఆయన.. ఆ దేశ ప్రధానితో చర్చల అనంతరం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
తమకు చైనా అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాత అని, 2.9 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ఆర్ధిక సాయం నిర్వహణలో కీలక షరతు అయిన శ్రీలంక బాహ్య రుణాల పునర్నిర్మాణానికి సహాయపడుతుందని తెలిపారు.రుణ పునర్నిర్మాణంపై బీజింగ్ తన వైఖరిని ఇంత వరకూ వెల్లడించలేదు. అయితే, రుణాల కాలపరిమితి పొడిగించడం, వడ్డీ రేట్లను చైనా సర్దుబాటు చేయవచ్చని శ్రీలంక అధికారులు అంటున్నారు. 2022 నాటి సంక్షోభం సమయంలో 46 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాలను శ్రీలంక డిఫాల్ట్‌గా ప్రకటించింది. నెలల తరబడి జరిగిన నిరసనల కారణంగా అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవి నుంచి తప్పుకున్నారు.‘శ్రీలంక రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు చైనా నిరంతరం సహకరిస్తుంది..
శ్రీలంక ఆర్థికాభివృద్ధికి సహాయం చేస్తుంది’ అని ప్రీమియర్ లీ కియాంగ్ హామీ ఇచ్చినట్టు గుణవర్దన కార్యాలయం తెలిపింది. కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హంబన్‌తోట పోర్ట్‌లను అభివృద్ధి చేయడానికి బీజింగ్ సహాయం అందించనుందని పేర్కొంది. కానీ, దీనిపై ముక్తసరి ప్రకటనతో సరిపెట్టింది. ఇదిలా ఉండగా, విదేశీ రుణాల డీఫాల్ట్‌గా ప్రకటించడంతో కొలంబో విమానాశ్రయ విస్తరణకు నిధులను జపాన్ నిలిపివేసింది.ఇక, హంబన్‌టోట్ ఓడరేవును 2017లోనే చైనాకు శ్రీలంక అప్పగించింది.
హిందూ మహాసముద్రంలో కీలకమైన ఈ పోర్టులో చైనా అడుగుపెట్టడంతో భారత్, అమెరికాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తన నౌకాశ్రయాలను ఎటువంటి సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని శ్రీలంక స్పష్టం చేసింది. అయితే గూఢచర్యం భయంతో చైనా పరిశోధనా నౌకలు హంబన్‌టోట‌కు రావడంపై న్యూఢిల్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

READ ON APP